భారతదేశం, జూన్ 28 -- రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు తమ పదవుల వల్ల చిరస్థాయిగా నిలుస్తారు. మరికొందరు తమ నిర్ణయాలతో దేశ భవిష్యత్తును మార్చిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఇలాంటి అరుదైన మహానుభావుల్లో మన పి.వి. నరసింహారావు అగ్రగణ్యులు. నాడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయనను ఆధునిక భారత చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. రాజకీయవేత్తగానే కాకుండా ఆర్థిక సంస్కరణల సారథిగా, దౌత్యవేత్తగా, బహుభాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా ఆయన వ్యక్తిత్వం అనేక కోణాలతో వెలుగొందింది.

తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న జన్మించిన పి.వి. నరసింహారావు విద్యాభ్యాసాన్ని ఉస్మానియా, నాగ్‌పూర్, ముంబై విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేశారు. తెలుగు, సంస్కృతం, హిందీ, మరా...