భారతదేశం, సెప్టెంబర్ 12 -- రాత్రివేళ ఆలస్యంగా పడుకోవడం, ఉదయమే త్వరగా లేవడం, రోజంతా ఆఫీస్ పనులతో సతమతమవ్వడం.. నేటి ఆధునిక జీవనశైలిలో సర్వసాధారణమైపోయింది. చాలామంది నిద్రను ఒక విలాసంగా భావిస్తున్నారు తప్ప, శరీరానికి అత్యంత కీలకమైన ప్రక్రియగా గుర్తించడం లేదు. రాత్రిపూట షిఫ్ట్‌లు, నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లు చూడటం, పని ఒత్తిడి వల్ల నిద్ర వేళలు పూర్తిగా మారిపోతున్నాయి. ఎప్పుడో ఒకసారి నిద్ర తగ్గితే పెద్దగా నష్టం లేకపోయినా, రోజూ శరీర సహజ సిద్ధమైన జీవ గడియారాన్ని (Circadian Rhythm) దెబ్బతీస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం పడుకున్నప్పుడు మెదడు ఊరికే ఉండదు. రోజంతా సేకరించిన జ్ఞాపకాలను భద్రపరచడం, మానసిక భావోద్వేగాలను నియంత్రించడం, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అనేక కీలక ప్రక్రియలను పూర్తి చేస్తుంది...